-->
Showing posts with label Addepalli Rama mohana Rao. Show all posts
Showing posts with label Addepalli Rama mohana Rao. Show all posts

Friday, July 7, 2023

అద్దేపల్లి రామమోహనరావు కవితలో భావచిత్రం: విశ్లేషణ ~ డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్


"పడమటి కొండమీద జారిపోతూ
ఊరి చివర తుమ్మతోపుల ముళ్ళు
గుండెలో గుచ్చుకొని
నెత్తురు కారుస్తున్నాడు సూర్యుడు
ఆ నెత్తురు తాగి
కన్నీటితో గడ్డకట్టి నిలబడ్డది కాలువ" అని
అద్దేపల్లి రామమోహనరావు ‘రక్తసంధ్య' కవితా సంపుటిలో 'సమాధిలో కలం' అనే కవితలోని ఈ కవితా పంక్తులు భావచిత్రానికి ఉదాహరణ. 


అందరూ చూసే, చూసిన దృశ్యమే ఇది. సాధారణ ప్రజలు దృష్టికంటే కవుల దృష్టి, అభివ్యక్తీకరణ భిన్నంగా ఉంటుంది అని నిరూపించిన కవిత. సమాధిలో కలం అనే కవితా శీర్షికను బట్టి కవితా వస్తువేమిటో మనం గ్రహించవచ్చు. కవీ సూర్యుడే. తన కవితాక్షరాలనే కిరణాలను లోకంలో ప్రసరిస్తాడు... చైతన్య పరుస్తాడు కవి సూర్యుడు.  అయితే ఈ పని అంత సులువైనది కాదు. స్త్రీ ప్రసవవేదనవంటిదే కవి తన అనుభూతికి  కవితాక్షరాలుగా జన్మనివ్వడానికి. ఈ కవితలో అదే కవి వేదన. ప్రాకృతిక దృశ్యాన్ని ఆలంబనగా చేసుకొని కవి వేదనను వ్యక్తీకరించాడు. 
      పడమటి కొండమీద  సూర్యుడు జారిపోవటం కవి వైఫల్యానికి ప్రతీక. తుమ్మతోపుల ముళ్ళు సూర్యుని గుండెలో గుచ్చుకొని నెత్తురు కారే దృశ్యం కవి బాధకి ప్రతీక. ఎర్రని అస్తమయ సూర్యుని ప్రతిబింబ వర్ణం  కాలువ కన్నీరు గడ్డకట్టి నిలబడింది అనడం కవిలోని నిరాశాస్థితికి ప్రతీక. ఇలా కవి తన ఆవేదననంతా ఒక అద్భుతమైన భావచిత్రంగా ప్రదర్శించాడు.