-->

Tuesday, March 3, 2020

మినీ మిరపకాయలు ఇ -బుక్ ఆవిష్కరణ


నేను రచించిన  "మినీ మిరపకాయలు" అనే  ఇ -బుక్ ను ఆంధ్ర విశ్వ విద్యాలయం జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ శాఖాధిపతి ఆచార్య పి.బాబీ వర్ధన్ గారు  3 మార్చి 2020 సాయంత్రం ఆవిష్కరించారు. ఇది నా మూడవ ఇ ~ బుక్. అనివార్య కారణాల వల్ల ఇన్నాళ్లు అముద్రితాలుగా ఉన్న ఎన్నో నా కవితా సంపుటులు ఇలా రంగుల అక్షరాలలో , ఆకర్షణీయంగా ఇ -బుక్స్ గా కొత్తరూపును సంతరించుకొని మీ ముందుకు వస్తున్నాయి. చదివి ఆస్వాదించండి. కామెంట్ రాస్తే సంతోషం. అభిరుచిగల మీ మిత్రులకు సాహితీ అభిమానులకు షేర్ చేసినా , ఫార్వార్డ్ చేసినా మరీ సంతోషం. ~ డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్   

పృథ్వి రాజ్ రూపొందించిన ఈ బుక్స్:



  

"మినీ మిరపకాయాలు " ఇ - బుక్ పై ఆంధ్ర విశ్వకళా పరిషత్, తెలుగు జె.ఆర్.ఎఫ్.స్కాలర్   భీమవరపు వెంకటేష్  రాసిన   సమీక్ష :
"హితేన సహితం సాహిత్యం" అని సాహిత్యమునకు వ్యుత్పత్తి ఉన్నది.అనగా మంచితో కూడుకున్నది సాహిత్యం అని అర్థం.పూర్వం సాహిత్యం పద్య రూపం లో ఉండేది. ఎన్నో కావ్యాలు,ప్రబంధాలు పద్యరూపం లో వెలువడ్డాయి. ఆ తర్వాత వచన కవిత్వం సాహిత్యంలో పెను మార్పులను తీసుకువచ్చింది.వచన కవిత్వం లో నవల,కథ,కథానిక మొదలైన ఎన్నో ప్రక్రియలు తెలుగున వచ్చి చేరాయి.వచన కవిత్వంనకు మరింత సంక్షిప్తంగా మినీ కవిత అనే ప్రక్రియ వచ్చినది.      
     చెప్పదలుచుకున్న విషయాన్ని  సూటిగాను, వ్యంగ్య భవనతోనూ చెప్పేదే ఈ మినీ కవిత.ఆచార్య జీ.వీ సుబ్రమణ్యం గారు అన్నట్లు"మినీ కవిత తన హ్రస్వత్వం చేత కాదు ఆకర్షించింది,ఒక భావాన్ని బలంగా చెప్పడానికి ఒక క్రొత్త వాహికగా అవతరించడం చేతనే ఇంత ఆదరణ పొందింది".ఇది నూటికి నూరు పాళ్లు సత్యము.అందుచేతనే 1975 లో మొదలైన ఈ మినీ కవితలు నేటికి అనేకంగా వెలువడుతూనే ఉన్నాయి.అలా వెలువడిన మినీ కవితల ముత్యాల హారాలలో చేర్చదగిన మరో అణిముత్యమే మినీ మిరపకాయలు అనే మినీ కవిత సంపుటి.
డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ గారు నూతన కవితా ప్రక్రియలను వినూత్నంగా తెలుగు సాహిత్యంనకు పరిచయం చేసేలా అనేక రచనలు చేశారు.వాటిలో దీర్ఘకవితా సంపుటిలు,హైకూ సంపుటిలు,నానీలు ఇలా అనేక రచనలు చేశారు.అంతేకాక ఆయన సంపాదకత్వం లో అనేక హైకూలు కూడా వెలువడ్డాయి.పృథ్విరాజ్ గారి సాహిత్య సింధువు నుండి వెలువడిన మరో రత్నమే ఈ మినీ మిరపకాయలు.
      పృథ్విరాజ్ గారి తత్వమేమిటో మనకు"నిక్కమైన నీలమొక్కటి చాలు"అనే పీఠిక లో వివరించారు.అలాగే ఆయన రాసిన ఈ మినీ కవితలకు ప్రేరణలను కూడా పేర్కొన్నారు."వేరు వేరయా"అనే కవితలో ప్రస్తుత సమాజ తీరును ఆయన కవిత్వికరించారు.నీతి,అవినీతి గురించి అందరూ మాట్లాడతారు.నీతిగా, న్యాయం గా ఉండాలని అందరూ ఎదుటివారికి చెబుతుంటారు.కానీ లోకం అంతా అవినీతిమయం గా ఉంటుందని,చెప్పేది వేరు,జరుగుతున్నది వేరు అని వేరు వేరయా కవిత లో పేర్కొన్నారు.
      చనిపోయిన వారి గురించి ఆ రోజు మంచిగా మాట్లాడి మరుసటి రోజు నుండి ఆ వ్యక్తి చేసిన చెడ్డ గురించి మాట్లాడేవారిని ఉద్దేశించి 'లోకం పోకడ'అనే కవితను రచించారు.అలాగే సమాజం లోని సమనత్వంను ఎంతవరకు పాటిస్తున్నారో,ఒక జాతికి చెందిన మనుషులలోనే అంటరానితనాన్ని నిరసిస్తూ'అంట్ల వెధవలు'అనే కవిత ఉన్నది.
        నేటి ప్రధాన సమస్య అయిన మద్యపానం గురించి,దానివలన బలైపోతున్న జీవితాలను గురించి,మద్యపాన నిర్ములించడం యొక్క ఆవశ్యకతను" సారాంశం"అనే కవితలో చక్కగా చెప్పారు.న్యాయవ్యవస్థ గురించి,పోలీస్ వ్యవస్థ గురించి "జడ్జిమెంట్, అసార్ధకనామధేయులు,అనే కవిత లో చెప్పడం జరిగింది.నేటి న్యాయ వ్యవస్థలలో తీర్పులు చెప్పని కేసులు ఎన్నో ఉన్నాయి. వాటిని గురించి పృథ్వి రాజ్ గారు"న్యాయ భారతం లో ఎడతెగని వాయిదా పర్వాలు"ఈ రెండు ముక్కల మాటలలో ఎన్నో వందల కేసులు గురించి, వాటి వెనుక జరుగుతున్న అవినీతిని గురించి,వాయిదాల జాప్యం గురించి ఆలోచింపచేశారు.
         నేటి కార్పొరేట్ రంగంలో పెంచిన ఫీజుల గురించి,పెద్ద పెద్ద చదువులు పెద్ద పెద్ద వారికోసమే ఉన్నట్లుగా భావిస్తున్న నేపథ్యం లో కార్పొరేట్ రంగంను ఎండగడుతూ రాసిన కవిత కార్పొరేట్. "షరా మాములే" అన్న కవితలో ఫోటోల కోసం ఫోజులిస్తూ పనిచేస్తున్న వారిగా     చిత్రించడం గురించి సోషల్ వర్క్ చేస్తున్నామని మనల్ని నమ్మించేందుకు వాళ్ళు చేస్తున్న షో వర్క్ గురించి పేర్కొన్నారు.అప్పుడప్పుడు నాయకులు పర్యటనకు వచ్చే సమయంలో నగరాలను,ఆయా ప్రాంతాలను తుడిచిన అద్దం లా పరుస్తుంటారు. అటువంటి వారిని మాయలు చేసే వారిగా చెబుతూ రచించిన "అబ్రకదబ్రా"అనే రచన రాజకీయ నాయకుల స్వభావాన్ని తెలుపుతున్నాయి.

      రాజకీయ పార్టీల గురించి ఎన్నికల ముందు వారు చేసే మాయలు గురించి "వ్యూహం"అనే కవితను రచించారు."మండే గుణం పెట్రోలిది,దండే గుణం పార్టీలది"ఈ వాక్యంలో అనంతమైన అర్ధాన్ని మనం గ్రహించవచ్చు.నేడు జరుగుతున్న కుంభకోణాలు,అవినీతి అంతా రెండు మూడు పదాలతో చెప్పడం జరిగింది.అలాగే అధికార పార్టీలు ప్రజాధనం ను ఎలా వృధా చేస్తున్నాయో చెప్పేందుకు చేసిన ప్రయత్నం "అధికారపార్టీ" అనే కవిత.ఫ్లెక్సబుల్ లీడర్ అనే కవిత లో గెలిచిన నాయకుల తత్వాన్ని,వారు ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో చక్కగా తెలియజేసారు.రాజకీయ పార్టీల వ్యూహాలు గురించి,అధికారం కోసం వారు చేసే ఎత్తుగడలు గురించి"నూతన ప్రభుత"అనే కవితలో తెలియజేసారు.
     నోట్లరద్దు గురించి ఆ సమయం లో సామాన్యులు పడిన బాధ గురించి కొండను త్రవ్వి అనే కవితలో తెలియజేసారు.
   పృధిరాజ్ గారి మినీ మిరపకాయలు లో సామాజిక అంశాలు కోకొల్లలు.రాజకీయ పార్టీల తీరును తెలియజేస్తూ వారు ఎక్కువ కవితలు రాయడం జరిగింది. సమాజ తీరును గురించి"లోకంపోకడ, వేరు వేరయా,అంట్ల వెధవలు, సారాంశం,స్వార్థంతీరు మొదలైన కవితలలో చెప్పారు.అలాగే రాజకీయాల గురించి ఎన్నికల కోడ్,పొత్తు పెటాకులు,ఫ్లెక్సబుల్ లీడర్స్,అధికారపార్టీ ఇలా అనేక కవితలు రాసారు.
  మినీ మిరపకాయలు అనే శీర్షిక గురించి మనం చెప్పుకోవాలి.చిన్న మిరపకాయలు ఎంత ఘాటుగా ఉంటాయో అంత ఘాటుగా ఉండే నా ఈ కవిత్వం అని పృథ్విరాజ్ గారు అన్నారు.ఆ వాక్యాన్ని నిజం చేసేలా అన్ని కవితలు ఉన్నాయి.దీర్ఘమైన విషయాన్ని కూడా సంక్షిప్తంగా చెప్పడం మినీ కవితకు మాత్రమే చెల్లుతుంది,అందులోనూ పృథ్విరాజ్ గారు సంక్షిప్తతకు మరో సంక్షిప్త రూపం తీసుకు వచ్చారని చెప్పక తగదు.ప్రతి కవితకు శీర్షిక ను ఎన్నుకోవడం లో ఆయన చూపిన నేర్పు అద్వితీయం అనే చెప్పాలి."లోకం 'పోకడ' ", 'చీప్' గెస్ట్, ఎన్ని'కల' కోడ్,'సారాం'శం ఇలా ఈ శీర్షికలు గమనిస్తే ఆయన చెప్పదలుచుకున్న అంశం గూఢంగా దాగి ఉన్నదని మనం గుర్తించవచ్చు.

   ఈ విధం గా అన్ని అంశాలలో "మినీ మిరపకాయలు" ను రచించి మన ముందు ఉంచారు పృథ్విరాజ్ గారు.మినీ మిరపకాయల లోని విషయం సంగ్రహణ గురించి చెప్పాలంటే ఇది" మినీ కాదు   *soo many* " అని కచ్చితంగా చెప్పాల్సిందే.

"మినీ మిరపకాయలు "ఫై సాహితీ మిత్రుల స్పందన :
"మీ మిరపకాయలు బావున్నాయి. బాగా పేలాయి. ఘాటుగా, కారంగా వున్నాయి. "~ మైత్రేయ

"కొన్ని చదివాను...చాలా బాగున్నాయి... అసార్థక నామధేయులు...కార్పొరేట్... సామాజిక వర్గం...గుడి గుడిసె. హ్యూమనిస్ట్... ఇంకా కొన్ని..."~ఎం. నరసింహులు 9391111307

మీ మిరపకాయలు ఆసాంతం ఆబగా ఆ స్వాదించాను. చాలా బాగున్నాయ్. శ్రీ శ్రీ మహాప్రస్థానానికి యోగ్యతా పత్రాన్ని రాస్తూ చలం ఒక దగ్గర ఇలా అంటాడు. " కృష్ణశాస్త్రి తన బాధ ను అందరి లో పలికిస్తే, శ్రీ శ్రీ అందరి బాధ నూ తనలో పలికిస్తాడు " బహుశా మీరు  శ్రీ శ్రీ కోవ కు చెందిన వారనుకుంటా. భూమ్మీ ద కవిత్వం బతికి వున్నంతవరకూ ఆ కవితాత్మ లో మీ యశ క్కాయం బతికే వుంటుంది. మున్ముందు ఇంకా ఎన్నో ఇలాంటి రచనలు మీ నుండి రావాలని కోరుకుంటూ. ~నిష్ఠల శాస్త్రి.

'మినీ మిరపకాయలు ' మహా ఘాటుగా వున్నాయి. ఎల్లప్పుడూ సమాజ స్థితిగతులను పరిశీలిస్తూ.. మనుషుల వ్యక్తిత్వాలను పరిశోధిస్తూ...సాంఘిక పక్షిలా...సంఘంలో మమేకమై వుండే "డా.తలతోటి పృథ్వీరాజ్ గారి వాడి ,వేడి భావాలకు ఆ ఘాటు తప్పదు మరి.~అమరజ్యోతి
"మిని మిర్చి....చాలా ఘాటుగా,చమత్కారముగ,మంచి మెసేజ్ తో చాలా బాగున్నాయి పృధ్వీ రాజ్ గారు..మీకు నా అభినందన సుమాలు" -.మీ..బల్లా నాగభూషణము..thankyou..పృధ్వీ గారు..*****

congratulation sir...big message with small words✍ GLV

స్పందన తెలియ జేసిన మిత్రులకు నా ధన్యవాదాలు. సమీక్షించిన స్కాలర్ చిరంజీవి భీమవరపు వెంకటేష్ కు నా నా కృతజ్ఞతాభినందనాలు. 
        ~ ధన్యవాదాలతో డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్  .   



 



తెలుగు హైకూ కవిత్వం

యజ్జల నానీలు  




నేటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని రంగాల వాళ్ళు అందిపుచ్చుకోవాలని ఏ.ఎం.ఏ.ఎల్.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. జయబాబు అన్నారు.
   ఇండియన్ హైకూ క్లబ్ వ్యవస్థాపకులు, కవి, అధ్యాపకులు డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ సంపాదకత్వంలో వెలువడిన "వెన్నెల రాత్రి" అనే హైకూ ఈ-బుక్ ను బుధవారం(12/06/2019) కళాశాలలో జయబాబు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కాగితాల వినియోగాన్ని తగ్గించే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని  కార్యాలయాలను కంప్యూటరీకరణచేసి పేపర్ లెస్ పద్ధతులను అవలంబిస్తూ ప్రోత్సహిస్తుంది. ఈ ఫైలింగ్ విధానాన్ని అనుసరిస్తుంది. ఇదే విధానాన్ని అవలంబిస్తూ పృథ్విరాజ్ తన సంపాదకత్వంలో "వెన్నెల రాత్రి "అనే ఈ-బుక్ ను తీసుకురావడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ విధానం ద్వారా చిటికెలో ఖండాంతరాలకు వాట్సాప్, ఫేస్ బుక్ , బ్లాగ్స్  మొదలగు సామాజిక మాధ్యమాల ద్వారా పాఠకులకు ఈతరహా ఈ-బుక్స్ ను ఒక్క క్లిక్ తో చేరవేయవచ్చని అన్నారు.

     ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు శ్రీమతి పి.వి.ఎస్. జ్యోతి , డబ్బీరు అరవింద్ ఘోష్ మరియు సంస్కృత అధ్యాపకురాలు  శ్రీమతి రజనీ కుమారి, బాబూ హరినాథ్ మొదలగు వారు పాల్గొన్నారు.






No comments:

Post a Comment