-->

Saturday, September 2, 2023

Thursday, July 27, 2023

డాక్టర్ హరి వంశరాయ్ బచ్చన్ " మధుశాల "

"నువ్వే నా మధు పాత్ర ప్రియతమా నేనే నీ - దాహార్తి
నిన్నే నాలో నింపుకు ఉంటే అవుతావు నువు నా అభ్యర్థి
నన్ను తాగేది నువ్వయితే మరి నిన్ను తాగేది నేనె కదా
మనమవుదాం ఇక పరస్పరం, ఒకరికి ఒకరం మధుశాల" అంటాడు హరివంశ రాయ్ బచ్చన్.

       ప్రేయసీ ప్రియులు ఒక మధుశాల. నిత్యం ఒకరికినొకరు మధువనే ప్రేమను సేవిస్తూ జీవితం సాగిస్తారు. ప్రేయసి మధుపాత్ర అయితే ప్రియుడు దాహార్తి.
      
      "మధుశాల" కవితా సంపుటి లోతైన తాత్విక చింతన. అమితాబచ్చన్ తండ్రిగారైన డాక్టర్ హరివంశ రాయ్ బచ్చన్ హిందీలో రాయగా,  డాక్టర్ దేవరాజు మహారాజు చే తెలుగులోకి అనువాదింపబడిన కవితా సంపుటే మధుశాల. మధుశాల కేవలం మధువుకే కాదు; ఒక ధ్యేయానికి, గమ్యానికి సంకేతం అంటాడు అనువాదకుడు మహారాజు.


"ఒక్కొక్కడుగూ వేస్తూ తీస్తూ ఎంత జీవితం నడిచాము
అయినా చాలా దూరం ఉందని దారి చూపు వారంటారు
సాహసముంటె వెనక్కి తిరగకు ధైర్యం ఉన్నా ముందుకు పోకు
కింకర్తవ్యమ్మని సంశయించు నను, దూరము నెట్టెను మధుశాల!"అంటాడు హరివంశ రాయ్ బచ్చన్.

"ఎరుపు వర్ణపు మదిరా ధారలు చూసి జ్వాలలని అనకండి
హృదయ జ్వాలల గాయం కాదు, మదిర మీది తెలి నురుగండి
విగత స్మృతి సాకీ అయితే, బాధే కద మధువున ఉన్న నిషా
రండి - బాధలో ఆనందం, పొందే వారిది మధుశాల"
అంటాడు హరివంశ రాయ్ బచ్చన్.

"మందిరమందున గంట కొట్టరు విగ్రహాలకి దండ వేయరు
మసీదుకు ఓ తాళం వేసి, మౌల్వీ గారు నిద్రపోదురు
రాజుల కోటలు బీటలు వారును గుల్లయి పోవును కోశాగారం
తాగు బోతులకు శుభం కలగనీ, తెరిచి ఉండనీ మధుశాల" 
ఈలోకంలో ఏం నశించి కనుమరుగైనా... ప్రేమ మధువును గ్రోలేవారికి ప్రేయసి హృదయ మధుశాలలు తెరిచే ఉంటాయని హరివంశ రాయ్ బచ్చన్ అంటారు. శుభం కలగాలని కోరుకుంటాడు.


"ఏడ్చేవారు ఒక్కరు మిగలక పరివారాలు నాశనమగును
సుస్వరాల సిరి గల భవనాలు చప్పుడు లేక మూగబోవును
రాజ్యాలన్నీ తల కిందవును రాజుల భాగ్యం నిద్ర పోవును
అయినా, తాగే వారిని కూడగట్టును - తట్టి లేపును మధుశాల" అంటాడు హరివంశ రాయ్ బచ్చన్.
అంటే ఈ లోకంలో ఏవి కళావిహీనమైనా, దూరమైనా నిత్యం మధువును ఆస్వాదించేవారితో నిత్యం సందడిగా ఉండేది మధుశాలే అంటాడు కవి.

"యుగయుగాలుగా జగమున మధువు, చెడుదని అందరు అంటారు
తాగేవాడు బుద్ది హీనుడు సాకీ హొయలు తుంటరివి
జగతికి మధువుకు జోడీ కుదరదు-దూరం పెరగదు
క్షీణించేది జగమైతే, నిత్యం రాణించేది మధుశాల"అంటాడు కవి హరివంశ రాయ్ బచ్చన్.


 పద్మభూషణ్  డాక్టర్ హరి వంశరాయ్ బచ్చన్ 80 కి పైగా రచనలు చేసిన కవి, కథకుడు, రచయిత. సుప్రసిద్ధ హిందీ నటుడు అమితాబ్ బచ్చన్ తండ్రిగారు. 1935లో రాసిన కవితా సంపుటి ఈ "మధుశాల". ఉమర్ ఖయ్యాం గ్రంథానికి అనువాదం కాదు మధుశాల. ఇది స్వతంత్ర రచన. భావుకత ద్రాక్ష లత అనీ....కల్పన తీగ అని, పాఠక జనం ఆ మధువును సేవించే వారని, పుస్తకమే మధుశాల అని కవి ఓ కవితలో రాశారు.
           హిందీలో "హాలా"వాదాన్ని... అంటే "మధు" వాదాన్ని ప్రతిపాదించిన కవి రాయ్.  హాలా అంటే మధువు. కానీ ఈ కవి దృష్టిలో మధువంటే మధువే కాదు; తన కావాల్సిన దాన్ని వెతుక్కోవడంలో మనిషి పొందే ఆనందమే "మధువ"ని రాయ్ భావం. ప్రేమకు, ఆధ్యాత్మికతకు, జీవన గమ్యానికి సంబంధించిన సంకేతం మధుశాల. ఉర్దూ కవులైన ఉమర్ ఖయ్యాం, గాలిబ్, జఫర్, మీర్, దాగ్ వంటి కవుల మాదిరిగానే మధువు, మధు పాత్ర, మధుశాల, సాకీ పదాలను ప్రయోగిస్తూనే సమకాలీన జీవితం, తాత్వికత, దేశభక్తి, మత సామరస్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ఈ "మధుశాల"లో కవితలు అల్లారు. హరివంశ రాయ్ బచ్చన్  అధ్యాపకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత,  రాజ్యసభ సభ్యులు. తన తండ్రి 115వ జయంతి ఉత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటీవలే అమితాబ్ బచ్చన్ తన తండ్రి మధుశాల కవితా సంపుటి ఆకృతిని రాతిబల్లగా పోలాండ్ లో తయారు చేయించి తన నివాసంలో ఏర్పాటు చేసుకున్నారు.

Saturday, July 15, 2023

శివసాగర్ జయంతి సందర్భంగా... 'నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు’ కవిత



"జీవితమా
నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు

పొదలో పొంచివున్న అడివి ఎలుగు
నాపై క్రూరాతి క్రూరంగా దాడిచేసే వేళ
నడిరాత్రి వెన్నెలమ్మ
నిశ్శబ్దంగా నా దరి చేరి
ప్రేమతో నన్ను సాదరంగా అనునయించే వేళ

జీవితమా
నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు
జీవితానికి మరణానికి మధ్య
నన్ను హల్లో అని పలకరించే
సరిహద్దు రేఖ మీద
పసిపాపలాంటి వృద్ధాప్యంలో
నిబ్బరంగా నిలబడి
చిరుగాలి సితారా సంగీతాన్ని
పలికించే వేళ, పలవరించే వేళ
జీవితమా
నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు" అని ‘నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు’ అనే కవితలో శివ సాగర్ తన జీవితాన్ని అభ్యర్థిస్తాడు. పెద్దల దోపిడీలతో, అసమానతలతో ఉన్న ఈ సమాజాన్ని కాపాడేందుకు విప్లవ మార్గంలో నడినవాడు... అభ్యుదయ - విప్లవ కవిత్వం రాస్తూ తన యవ్వనాన్ని, జీవితాన్ని ఖర్చుచేసిన త్యాగశీలి శివసాగర్.

శివసాగర్ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా 'నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు’ అనే వారి కవిత మీకోసం. శివసాగర్ పురాణ ప్రతీకలు వాడుతూ కవిత్వం రాయడంలో దిట్ట. కవిత్వం కంటే గేయరచనల ద్వారే వారికి గుర్తింపు.~ డాక్టర్ తలతోటి పృథ్విరాజ్
#శివసాగర్ #సత్యమూర్తికెజి #విప్లవకవి #తెలుగుకవిత్వం #హైకూక్లబ్ #తలతోటిపృథ్విరాజ్

Dr Talathoti Prithvi Raj
www.talathoti.com
www.litt.in

Friday, July 7, 2023

అద్దేపల్లి రామమోహనరావు కవితలో భావచిత్రం: విశ్లేషణ ~ డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్


"పడమటి కొండమీద జారిపోతూ
ఊరి చివర తుమ్మతోపుల ముళ్ళు
గుండెలో గుచ్చుకొని
నెత్తురు కారుస్తున్నాడు సూర్యుడు
ఆ నెత్తురు తాగి
కన్నీటితో గడ్డకట్టి నిలబడ్డది కాలువ" అని
అద్దేపల్లి రామమోహనరావు ‘రక్తసంధ్య' కవితా సంపుటిలో 'సమాధిలో కలం' అనే కవితలోని ఈ కవితా పంక్తులు భావచిత్రానికి ఉదాహరణ. 


అందరూ చూసే, చూసిన దృశ్యమే ఇది. సాధారణ ప్రజలు దృష్టికంటే కవుల దృష్టి, అభివ్యక్తీకరణ భిన్నంగా ఉంటుంది అని నిరూపించిన కవిత. సమాధిలో కలం అనే కవితా శీర్షికను బట్టి కవితా వస్తువేమిటో మనం గ్రహించవచ్చు. కవీ సూర్యుడే. తన కవితాక్షరాలనే కిరణాలను లోకంలో ప్రసరిస్తాడు... చైతన్య పరుస్తాడు కవి సూర్యుడు.  అయితే ఈ పని అంత సులువైనది కాదు. స్త్రీ ప్రసవవేదనవంటిదే కవి తన అనుభూతికి  కవితాక్షరాలుగా జన్మనివ్వడానికి. ఈ కవితలో అదే కవి వేదన. ప్రాకృతిక దృశ్యాన్ని ఆలంబనగా చేసుకొని కవి వేదనను వ్యక్తీకరించాడు. 
      పడమటి కొండమీద  సూర్యుడు జారిపోవటం కవి వైఫల్యానికి ప్రతీక. తుమ్మతోపుల ముళ్ళు సూర్యుని గుండెలో గుచ్చుకొని నెత్తురు కారే దృశ్యం కవి బాధకి ప్రతీక. ఎర్రని అస్తమయ సూర్యుని ప్రతిబింబ వర్ణం  కాలువ కన్నీరు గడ్డకట్టి నిలబడింది అనడం కవిలోని నిరాశాస్థితికి ప్రతీక. ఇలా కవి తన ఆవేదననంతా ఒక అద్భుతమైన భావచిత్రంగా ప్రదర్శించాడు. 

పి. అనంతరావు గారి "పొగ జెండా" కవితా విశ్లేషణ :~ డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్


"మా చెమట
మా జీవితాల ఎజెండా
పొగ జెండా
అది మరిగి, మరిగి, ఆవిరై, పొగలై
ఫ్యాక్టరీ గొంతుల్లోంచి
వినీల ఆకాశ వీధుల్లో ఎగురుతుంది
మా చెమట బొట్ల విజయాన్ని
బాహాటంగా, సగర్వంగా చాటుతుంది
గుండెల్లో రగిలే సెగల్లోంచి
ఎగిసిన పొగల అల్లికయే మా జెండా!" అని కవి పి. అనంతరావు తన "పొగ జెండా" కవితా సంపుటిలో కవితను చెబుతూ...‌ శ్రామికుల శ్రమశక్తితో... ఉత్పత్తులతో స్వర్ణకాంతులీనాల్సిన ఈదేశం ఎడారిగా విస్తరించడాన్ని చూసి ఆవేదన చెందుతాడు. వృత్తిరీత్యా కవి కార్మికుడే! కర్మాగారాలు తమకు తల్లి ఒడి అని...సర్వస్వం అని, అటువంటి కర్మాగారాలను కొన్ని దోపిడీ శక్తులు కుహనా రాజకీయ నాయకులతో చేతులుకలిపి ఆక్రమించే ప్రయత్నాల్ని కవి నిరసిస్తూ...

"మమ్మల్ని ఫ్యాక్టరీల నించి గెంటాలని చూస్తే
తిరుగుబాటు పొగల్లో మీకు ఊపిరాడకుండా చేస్తాం
మా ఫ్యాక్టరీల్ని
మా దేశాల్ని
మా ప్రజల్ని
కాపాడుకునే కర్తలం, క్రియలం మేమే
ఏనాటికీ మాకు ఓటమి లేదు
అందుకే
మా చెమట
మా జీవితాల ఎజెండా!", అని ముగిస్తాడు. 

కరోనా బలిగొన్న అనేకులలో ఒకరు కవి అనంతరావు. నన్ను అభిమానించే సాహితీ మిత్రుడు. 

పి. అనంతరావు, ఎం.వి.ఆర్. మూర్తి విశాఖపట్నంలో కవిసోదరుల్లా సాహితీ సమావేశాలలో కనిపిస్తుంటారు. అభ్యుదయ భావజాలం గల కవులు. అరసం లో సభ్యులు, కొన్నాళ్ళు కార్యవర్గ సభ్యులుగా కూడా బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు. అద్దేపల్లి రామమోహనరావు గారి అనుంగు శిష్యులు. పి. అనంతరావు గారు ఇండియన్ హైకూ క్లబ్ సమావేశాలలో పాల్గొనేవారు.కనికరంలేని కాలం.. వయసు కలిసి ఆయనకు గుండెజబ్బు తెచ్చిపెట్టాయి. ఇంకొన్నాళ్ళకి కరోనా బలిగొంది. అనంతరావు నన్ను అభిమానించే వ్యక్తి. వారి స్మృత్యర్థం వారి అభ్యుదయ కవితను మీకు పరిచయం చేయాలని ఈ కవిత. విశాఖ స్టీల్ ప్లాంట్ 
 ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి ఈ కవిత స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.

#పి.అనంతరావు #పొగజెండా #తెలుగుకవిత్వం #అభ్యుదయరచయితలసంఘం #హైకూక్లబ్ #తలతోటిపృథ్విరాజ్
~ Dr Talathoti Prithvi Raj,
www.talathoti.com
www litt.in

శ్రీ కొణతం నాగేశ్వరరావు "గీతరచనా దీపిక" గ్రంథ సమీక్ష : డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్

     శ్రీ కొణతం నాగేశ్వరరావు వ్రాసిన "గీతరచనా దీపిక" పరిశోధన గ్రంథం. మంచి కృషి. పాట రాయడానికి సంగీతం, లయ, సమతా, తూగు వంటి విషయాల కంటే ఛందస్సుండటం ప్రతిపాదించి ఇందులోని చందస్సును వింగడించడం చూస్తే ఆనందం, ఆశ్చర్యం కలుగుతాయి, ఇది గొప్ప కృషి. ఇది మంచి పరిశోధనాత్మకమైన రచన. ఈ కృషి ఉన్నత విశ్వవిద్యాలయాలలో జరగవలసిన కృషి. దీన్ని ఇంత బాగా రూపొందించిన ఈ పరిశోధకుణ్ణి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. అని తన ముందు మాటలో పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు అంటారు. అంతేకాదు ... ఛందో ఆధారంగానే పాటలు రాయబడతాయనప్పుడు జానఫదులపాటల్లో ఛందస్సుందరంగా ఉండడానికి గల కారణాన్ని చెప్పాలని ఇనాక్ అభిప్రాయపడ్డారు.

     ఎనిమిది ఆధ్యాయాలు విభజించుకుని వివరించిన తన పరిశోధనాత్మక రచనలో గేయ ప్రక్రియ పుట్టుక, నిర్వచనం, ప్రయోజనం, విభిన్న గీతాలను వివరించి, సాకి, పల్లవి, అనుపల్లవి, చరణాలు గూర్చి తెలిపారు. పాట రచనకు ఉపయోగించే అక్షర చ్ఛందస్సు, మాత్రా ఛందస్సు, పాదసౌష్ఠవం, లయ, యతి, ప్రాసలు గూర్చి వివరించారు‌‌.  గాన యోగ్యతకు ఉపకరించే రగడలు, జాతులు, ఉప జాతులు, వివిధ వృత్తాలు పేర్కొన్నారు. అన్నమయ్య, త్యాగయ్య సంకీర్తనలనే గాక, వివిధ కవులు రచించిన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలను, లలిత గీతాలు, దేశభక్తి గీతాలు, సినీ గీతాలను ఉదాహరణకు తీసుకుని విశ్లేషించారు.

     పాటలు రాయాలనుకునే ఔత్సాహికులకు ఉపయోగపడే, అవగాహన కలిగించే పరిశోధనాత్మక రచన ఇది.కొణతం నాగేశ్వరరావు గారు రంగస్థల నటులు. 2010 రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. 2009 నుండి తెలుగు విద్యార్థుల పాఠ్యాంశాలను స్వియగానంతో ఆడియో సీడీలను తీసుకొచ్చారు. 'శతక సుధా స్రవంతి' సాహితీ సాంస్కృతిక సంస్థను స్థాపించి కవి సమ్మేళనాలు,పద్యపోటీలు, ఏకపాత్రాభినయాలు నిర్వహించారు. "సాహితీ కళారత్న"గా పలు సన్మాన, సత్కారాలు, పురస్కారాలు అందుకున్నారు. 

     వీరు కవిగా పరిశోధకునిగా  ప్రేమ విలాసం (ఖండ కావ్యం) 2017, ఆదివాక్యోదాహరణము (ఉదాహరణ కావ్యం) 2020, గీతరచనాదీపిక - (2023) గ్రంథాలు రచించారు.

"గీతరచనా దీపిక" రచించడంలో శ్రీ కొణతం నాగేశ్వరరావు గారి పరిశోధనాత్మక కృషికి నా అభినందనలు.

డెమ్మి సైజ్ లో, 122 పేజీలతో ఉన్న ఈ పుస్తకం వెల 120/-.రూపాయలు. కావాల్సినవారు ఈ అడ్రెస్ ద్వారా పొందవచ్చు. 


శ్రీ కొణతం నాగేశ్వరరావు
ఇంటి నెం.37-12-1817/20,
11వ వీధి, శివనాగరాజుకాలనీ,
(B.O.) రెడ్డిపాలెం, (S.O.) పెదకాకాని,
గుంటూరు-522509.
చరవాణి : 9985144963

మల్లవరపు జాన్ " అస్పృశ్యత " పద్యాలు


"నాక మునుండి యూడిప డెనా? యొకరుండు; మఱొక్కరుండధో
లోకమునుండి వచ్చెనె? ప్రలోభులు స్వార్ధము నెంచి మానవా
నీకమునందు నగ్రజులు నిమ్న జులన్న విభేద తత్వముల్
వాకొని మభ్య పెట్టి వెలివాడల నుంచిరి నిన్ను; సోదరా!" అని మధుర కవి మల్లవరపు జాన్ "అస్పృశ్యత " అనే పద్య ఖండికలోని ఈ పద్యంలో అంటాడు!
 "చెప్పారాని కులం" అని దళితులగూర్చి మాట్లాడేవారికి బుద్ధి చెప్పడానికి బదులు భయపడుతూ... వారే ఎదురైతే నమస్కారాలంటూ ఎంతకాలం సహిస్తావంటూ తన దళిత సోదరులను కవి నిలదీసి స్వార్ధపరుల కుట్రను వివరించాడు 

"ఎక్కువ మా కులమ్మను మహీ సురులైన వివాహవేళ నా
చుక్కలలోని నీయనుగు సోదరియైన 'అరుంధతీ' సతిన్
'మొక్కులు వెట్టి చూచి శుభముల్గొను చుండగ నీకులం బెటుల్
తక్కువయయ్యె; దుర్జనుల తంతులు
చిత్రవిచిత్రముల్ గదా!" అని మరోపద్యంలో అంటాడు కవి. మనం తక్కువ కులమనీ, వారు ఎక్కువ కులం అని చెప్పుకునేవారు, వివాహ సమయంలో  మన సోదరి అరుంధతీకి  నమస్కరిస్తూ వారు శుభం పొందుతున్మప్పుడు మన కులం తక్కువెలా అవుతుంది? ఇవన్నీ దుర్జనుల పనులుగా గ్రహించమని తన జాతి జనులలోని ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టే హితవచనాలు చెబుతాడు కవి మల్లవరపు జాన్.
 
అస్పృశ్యులు, నిమ్నజాతి వారంటూ సమాజంలో దళితులను దళితేతరులు తక్కువ వారిగా చూస్తుంటే...  దళితులు మాల మాదిగలనే బేధంతో ఉంటే...  సమానత పొందేదెపుడు, వారితో కలిసి తిరిగేదెపుడని ప్రశ్నించాడు కవి. ఇంటగెలిచి రచ్చగెలవాలి అనే సామెతను తన జాతిజనానికి ఇలా గుర్తు చేస్తున్నాడు కవి.
"మాల యతడు; నేను మాదిగ కులజుడ;
నను విభేద ముండు నంత దనుక
కలిసి తిరుగ లేవు గద! కులీనుల తోడ
ఇంట గెలిచి రచ్చ కేగుమయ్య!"


మల్లవరపు జాన్ ఛందో బద్ధమైన రచన ప్రౌఢమైనది కాదు. అతి సరళమైన శైలి.సమాజ హితాన్ని చాటడమే గాక... కుల వివక్షను ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం సభ్యుడు. "విశ్వ ప్రకాశము" ఖండకావ్యం. 20 శీర్షికలతో ఇందులో పద్యాలు ఉన్నాయి.
ఆ విధంగా వ్యవహరిచేవారు స్వర్గం నుండో అధోలోకం నుండో రాలేదు... స్వార్థంతో ఎక్కువ తక్కువలు సృష్టించి వెలివాడలో నుంచిని సత్యాన్ని  


మద్దూరి నగేష్ బాబు. గారి "మాటిపూట" కవిత ~ Dr Talathoti Prithvi Raj


"ఎవడో కులంపేరెత్తి తిట్టినట్టు
కందగడ్డయిపోయిన మాటీడి సూర్యుడు

రాత్రి నిరాహారా దీక్షకోసం
పచ్చిక బయళ్లనుండి అయిష్టంగా కొట్టాలకు వస్తున్న గొడ్లు

ఏ చిన్నదేశంమీదో అమెరికావిమానాలవాన కురిపించినట్టు
వరసగా వెళ్లిపోతున్న ఏటికొంగలబారు

బడి నుండి ఇంటికొస్తే
కల్లాల దగర్నుండి అమ్మ ఇంకా రాలేదు..." అని "మాటిపూట " అనే కవితలో మద్దూరి నగేష్ బాబు అంటాడు. 
      సాయంకాలం పడమర గూటికిచేరే సూర్యుడు...గూటికి చేరే కొంగలు, కొట్టాలకు చేరుకునే గొడ్లు, స్కూల్ నుండి ఇంటికి చేరుకునే పిల్లలు. ఒకే సమయంలో కనిపించే ఈ దృశ్యాల్ని దళిత స్పృహతో సమర్ధవంతంగా కవిత్వీకరించాడు.

   ఎర్రటి అస్తమయ సూర్యుడ్ని దళిత స్పృహతో వ్యక్తీకరించాడు. పల్లేల్లో గొడ్లుకాచే దళితుల దుస్థితి గుర్తుచేశాడు. నాయకుల దొంగ నిరాహార దీక్షను ఎత్తిపొడిచాడు.

చిన్నదేశాలమీదే కాదు; చిన్నకులాలుగా చిత్రించే సాగించే దౌర్జన్యాలు, మారణకాండను ఎగిరెళ్ళే కొంగల బారును సామాజిక దృష్టితో చూశాడు కవి.

 బడినుండి ఇంటికి వచ్చినా కల్లంనుండి ఇంటికి రాని తల్లిగూర్చి  ఆలోచించే పిల్లవాడి  ద్వారా దళితుల్లోని అభద్రతా భావాన్ని కవి వ్యక్తీకరించాడు.


Wednesday, July 5, 2023

Tuesday, June 27, 2023

శ్రీరంగం నారాయణబాబు✓


    "ప్రేమకు ప్రాణాలిచ్చే స్త్రీలు
    ఉరికొయ్యల్లాంటి మగాళ్ళు
    ... ... ...
    గుమస్తాలంతా గుల్లగాళ్ళు
    బీదవాళ్ల నెత్తురు
    బీరులాగ తాగేస్తారు
    ... ... ...
    ధర్మాన్ని పశువునిచేసి
    పట్టపగలు కోర్టులోన
    వధచేసి, సాయంత్రం
    సురాపానంలో చప్పరించి
    నంచుకుంద్రు" అని 'విశాఖపట్టణం' అనే గీతంలో అంటారు నారాయణ బాబు. ఒక స్థలాన్ని వర్ణించిన ఆధునిక స్థలపురాణం ఈ గీతం! "సర్రియలిజం" అనే "అధివాస్తవికత " కవితా నిర్మాణం శైలిలో నారాయణ బాబు రచనలు చేశారు. తెలుగు సాహిత్యంలో అధివాస్తవిక కవిత్వాన్ని ప్రవేశపెట్టిన ప్రముఖులలో
ఒకరు శ్రీరంగం నారాయణరా బాబు. అతి నవ్యకవితా రీతులలో కవితా చిత్రాలను చిత్రించే సమర్ధ కవి. నాటక రంగంలోనేగాక, "భక్త 
కబీర్" సినిమాలోకూడా నారాయణ బాబు నటుడిగా నటించారు.

    "పల్లకీ దిగినట్టి
    పెళ్ళికొడుకులు మీరు
    పట్టుతివాసీని నేను
    నడవండి, నడవండి!
    నామీంచి నడవండి!!" అని "గడ్డిపరక" అనే గీతంలో వర్ణిస్తాడు. గడ్డిపరక పేదలకు ప్రతీకైతే..‌‌., వీరి జీవితాలపై నడుచుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళేవారికి ప్రతీక ధనికులు.  పశువుల నోటికి పాయసాన్నంగా కూడా వర్ణించాడు కవి.
"నీ
పాటల కత్తులతోనే
నా
హృదయం నెత్తురుతీసి
నే
వెలిగించిన
దీపపు కాంతిని నర్తింపుముర
శ్రీ
శ్రీశ్రీ!" అని శ్రీశ్రీ పై కవిత రాశారు.

నారాయణ బాబు రచనలు:
విశాఖపట్నం
ఫిడేలు నాయుడుగారి వేళ్ళు
గడ్డిపరక
గేదెపెయ్యె
తెనుగురాత్రి
రుధిరజ్యోతి
కపాలమోక్షం
కిటికీలో దీపం
ఊరవతల
పండగనాడు
మౌన శంఖం
సంపంగి తోట
    ఈరోజు శ్రీరంగం నారాయణ బాబు గారి జయంతి సందర్భంగా ఈ వీడియో. అధివాస్తవికతను అనుసరించే కవితాశైలి నారాయణ బాబుది. అధివాస్తవికత ను ఇంగ్లీష్ లో సర్రియలిజం అంటారు.  ఊహను, వాస్తవాన్ని అనుసంధానిస్తూ వ్యక్తీకరించే రచనా ప్రక్రియనే అధివాస్తవికత... లేదా సర్రియలిజం అంటారు. 

Friday, June 23, 2023

నగ్నముని కవిత ✓


“ఎంగిలి మెతుకులేరుకొని ఎలక్ట్రిక్ తీగల మీదా
ఇళ్ళకప్పుల మీదా జంతు కళేబరాలమీదా
అలగాజనం పుళ్ళమీదా
పొడుచుకు తినడానికి చేరే కాకులు మాత్రమే
మిథ్యగూర్చి కావు కావుమంటూ ప్రవచించగలవు" అని దివిసీమ ఉప్పెన విపత్తును "కొయ్య గుర్రం " దీర్ఘ కవితగా రాసిన నగ్నముని ప్రతీకాత్మక కవిత రాశాడు. కవితా సంపుటి పేరే ప్రతీకగా పెట్టారు. 

గుర్రం వేగానికి గుర్తు. కొయ్య గుర్రం జడత్వానికి  అధికారానికి, అసమర్ద పరిపాలనకి ప్రతీక.  కొయ  యంత్రాంగం వైఫల్యాన్ని. కొయ్య గుర్రం చలనం లేని వ్యవస్థ, ప్రభుత్వానికి ప్రతీక.

 ఎంగిలి మెతుకులేరుకోవటం  అంటే .... శ్రమించకుండా అవినీతి సొమ్ముతో బ్రతకడం అలవాటు చేసుకున్న అధికార గణం కాకులకు ప్రతీక. అలగా జనం పేదలకు ప్రతీక. పరిస్థితులు ఎలా ఉన్నా ఊరిపై...ఇళ్ళపై... జనంపై బడి దోచేయడమే కాకులకు ప్రతీక అయిన అధికారులు, నాయకుల తీరును కవి నగ్నముని నిరసించాడు.
========
"ముక్కులు పగల గొడుతున్న
దుర్గంధ రక్త స్రావంలో దూకి కేరింతలమునకలేస్తూ
దుర్గంధ రక్త స్రావాన్నే దోసిళ్ళతో తాగుతున్న
మనుషులనే మందల్ని చూశా

నాలుకలు చిమ్ముతూ
బ్రతుకును మురగబెడుతూ
సస్యశ్యామలాల్నీ మానవత్వపు పరిమళాల్నీ
ముంచేస్తున్న యీ ప్రవాహం ఎక్కడనుండోనని
పుండు ఎక్కడోనని కత్తుల్తో ప్రయాణంచేశా

ప్రపంచం ముట్టయింది
రాజకీయాలు రక్త స్రావం." అని "కంపు " అనే కవితలో నగ్నముని అంటాడు. దుర్గందపూరితమైనవి రాజకీయాలు. కుల,మత, ప్రాంతీయ బేధాలతోనే గాక, పార్టీలపరంగా కూడా మనుషులు విడిపోయారు. అధికార పార్టీ పాలనా నిర్ణయాలతో సగటు మనిషి చితికిపోతున్నా, ఆ పార్టీలకోసం గ్రూపులుగా ప్రజలు తన్నుకు ఛస్తారు. సిద్ధాంతాలు మరచి అపవిత్రపొత్తుల్తో రాజకీయం చేయడం, నమ్మి ఓటేసిన ఓటరు నడ్డివిరవడం, ఇచ్చిన హామీలను మర్చిపోవడం....పాలనా తీరును ప్రశ్నిస్తే విమర్శిస్తే ప్రజల్ని బెదిరించి నోరుమూయించడం..‌..
ముట్టైతే జరిగే రక్తస్రావమే ఈ తంతంతా!

Friday, June 2, 2023

వెంపలి వెంకట శివప్రసాద్ కవిత్వం

కొమ్మమీది కోయిలనై ....
======-వెంపలి వెంకట శివప్రసాద్


"లోకంలోని శోకాన్నంతటినీ తాగేసి
ధబ్బున కూలిపోతాను
భగ్గున మండిపోతాను
అసలే నివురై పోతాను
అప్పుడు..
వెయ్యి సౌఖ్యాల వెలుగులు
కళ్ళలో నింపుకొని
ఆనందగంగా ప్రవాహంలో
మునిగి తేలుతున్న జనాన్ని
అసమానతలసలే లేనిలోకాన్ని
భూతల స్వర్గాన్ని
పాటలుగా కూర్చి పాడడానికి
కోమ్మమీది కోయిలనై పుడతాను." అని సమసమాజ స్థాపన పట్ల తన ఆశావాదాన్ని ప్రకటించాడు. అందుకోసం తాను ఏ త్యాగానికైనా సిద్ధమన్నట్లు కవి వెంపలి వెంకట శివప్రసాద్ అంటాడు. చాలామంది కవులకుండే బలహీనతే వెంపలిని కవిత్వంనుంచే కాదు;, అతనినీ.... అతని కవిత్వాన్ని ప్రేమించే వారినుండి శాస్వతంగా దూరం చేసింది.

"మేం విధ్వంసకులం
చీకటి తెరలు చీల్చుతాం
మేం నిర్మాతలం
వెలుతురు తోరణాలు కడతాం" అని వెంపలి వెంకట శివప్రసాద్ , విప్లవ కవులు తమ కవితాక్షరాలతో సమాజంలోని సమస్యల చీకట్లను ఎలా తొలిగించి వెలుతురు సంతోషాల్ని పంచుతారో మినీకవితగా చెప్పాడు. అంతే కాదు;...
"సూరీడు
‘కోడివేసే తొలి కూతకు
తూరుపు కొండల్లో ఉదయిస్తే..
నేను పెట్టే పొలికేకకు
జనం గుండెల్లో ఉదయిస్తాడు" అని అభ్యదయ విప్లవ కవుల కవితాక్షరాల శక్తిని, వారి గొంతుకల బలాన్ని మరో మినీ కవితలో ఇలా చాటాడు.
        మినీకవితా ఉద్యమ కాలంలో క్రియాశీలకంగా మినీకవితా ప్రక్రియ వ్యాప్తికి కృషి చేస్తూ, ప్రక్రియను అనుసరిస్తూ "కెరటాలు, చినుకు, శ్వేతనాగు, తోటపని, నేలచుక్క, రివ్వున సాగే, సప్తరుషి మండలం" వంటి పుస్తకాలను తీసుకువచ్చిన వెంపలి అనకాపల్లి వాసి. వృత్తిరీత్యా పాత్రికేయుడు, నాకు సాహితీ మిత్రుడు.

Friday, November 4, 2022

RJD_Inquiry Report_AMAL College_Anakapalle_Dr T Prithvi Raj_JD_David Kumar Swamy_CollegiateEducation

17-12-2019న నాటి రాజముండ్రి ఆర్జేడీ, నేటి జెడి డాక్టర్ పి. డేవిడ్ కుమార్ స్వామి అనకాపల్లి, ఏ.ఎమ్ .ఏ.ఎల్       

. కళాశాల ఇర్రెగ్యులారిటీస్ పై ఎంక్వైరీ ఏవిధంగా ఆరోజు నిర్వహించారో మీరు గమనించవచ్చు. మరీముఖ్యంగా ఈ సందర్భంగా ఏ ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయో గమనించవచ్చు. ఎన్.సి.సి. ఆఫీసర్స్ నియామక ప్రస్తావన గమనించవచ్చు. మేనేజ్మెంట్ తో కూడి వారికి అనుకూలమైన రిపోర్ట్ రాయడానికి వెనుకాడని డా. డేవిడ్ కుమార్ స్వామి       


ఈ క్రింది లింక్ ను క్లిక్ చేస్తే 

e-book Series-1

On " Dr. P. David Kumar Swamy Inquiry Report "

Rc.No:816/B-1/2019, Dated: 29-01-2020.

To,  The Commissioner of Collegiate Education & Public బుక్ డౌన్ లోడ్ కొరకు ఈ క్రింది బుక్ కవర్ పేజీపై క్లిక్ చేసినచో download  లింక్ వస్తుంది.

Click on Cover page for Download link option